నవశకం.అశ్వాపురం, ఆగస్టు 15: సీతారామ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కాలువల పనుల్లో ఇక ఎలాంటి జాప్యం చేయకుండా భూసేకరణను వేగవంతం చేసి పనులను పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరులోగా సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
శనివారం అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద సీతారామ ఎత్తిపోతల పథకం పంప్హౌస్ను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం సబ్కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూటరీ కాలువలకు సంబంధించిన భూసేకరణ, పైప్లైన్, ఇతర నిర్మాణ పనుల పురోగతిని ఇరిగేషన్ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీతారామ ఎత్తిపోతల పథకం పంపును ఆన్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు.
సీతారామ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చి రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని, భూములు అప్పగించిన వెంటనే రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవతో భూసేకరణకు అవసరమైన నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
పైప్లైన్ ఏర్పాటు చేసిన భూముల్లో పనులు పూర్తయిన అనంతరం రైతులు భూమి పైభాగంలో తిరిగి వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంటుందని మంత్రి వివరించారు. రైతులకు న్యాయమైన నష్టపరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు. కొంతమంది రైతుల కారణంగా పెద్ద సంఖ్యలో రైతులకు ప్రయోజనం చేకూర్చే ప్రాజెక్టు పనులు నిలిచిపోకూడదని, రాజకీయాలకు అతీతంగా ప్రాజెక్టు పనులకు అందరూ సహకరించాలని కోరారు.
డిస్ట్రిబ్యూటరీ కాలువల పనులను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి సుమారు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. నాగార్జునసాగర్ ఆయకట్టుకు అదనంగా సీతారామ ప్రాజెక్టు ద్వారా సుమారు మూడు లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు.
గోదావరిలో నీటి ప్రవాహం ఉన్నప్పుడే నీటిని ఎత్తిపోసుకునేలా చర్యలు చేపట్టాలని, పైప్లైన్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే సమయంలో సీతారామ ప్రాజెక్టు నీరు రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. తుమ్మల చెరువు నిండడం ద్వారా సాగునీటితో పాటు పర్యాటక అభివృద్ధికి కూడా అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. బూర్గంపాడు మండలంలో సుమారు 25 వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు.
అనంతరం మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులను మంత్రి పరిశీలించారు. పనులు ఇంకా పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన భూసేకరణతో పాటు నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణకు అవసరమైన నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందని రైతులకు తెలిపారు. ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తయ్యేలా రైతులు సహకరించాలని కోరారు.
వందల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టు పనులు కొంతమంది రైతుల కారణంగా నిలిచిపోవడం సమంజసం కాదని మంత్రి అన్నారు. ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం చేకూర్చే ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రైతులకు నష్టం కలగకుండా నష్టపరిహారం చెల్లిస్తూ భూసేకరణను పూర్తి చేసి, ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి సాగునీటిని అందించాలని అధికారులను ఆదేశించారు.