నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు: సీఐ సిహెచ్ ఎల్లయ్య.
అశ్వాపురం, జూలై 22:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలో బుధవారం స్కూల్, కాలేజీలకు చెందిన వాహనాలపై అశ్వాపురం సీఐ సిహెచ్ ఎల్లయ్య ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ఈ తనిఖీల్లో వాహనాల ఫిట్నెస్, బీమా, ఆర్సీ, పర్మిట్, పీయూసీ సర్టిఫికెట్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఎమర్జెన్సీ ఎగ్జిట్, స్పీడ్ గవర్నర్ తదితర భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. అలాగే డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్స్లు, అర్హతలను కూడా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా సీఐ సిహెచ్ ఎల్లయ్య మాట్లాడుతూ, విద్యార్థుల ప్రాణాలతో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, వాహనాల్లో అధిక సంఖ్యలో విద్యార్థులను ఎక్కించరాదని, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని డ్రైవర్లు, విద్యాసంస్థల యాజమాన్యాలకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ తనిఖీల్లో ఏఎస్ఐ రామచంద్రారెడ్డితో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.