మనుబోతుల గూడెం పోడు భూముల వివాదం.

నవశకం ప్రతినిధి వెంకట్ రెడ్డి అశ్వాపురం
By -
0
*
*అడవి సంరక్షణా..?*


 *గిరిజనుల జీవన హక్కులా..?*

*ఘటన వెనుక కుట్ర కోణమా..?*
 
*చట్టం ఏమి 
 చెబుతోంది.*?



అశ్వాపురం .జూలై 21. విజన్ ఆంధ్ర.



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలం, మనుబోతులగూడెం గ్రామ పంచాయితీ పరిధిలోని, వేములూరు అటవీ ప్రాంతంలో అటవీశాఖ సిబ్బంది, ఆదివాసుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఒకవైపు పోడు భూములపై గిరిజనుల హక్కుల వాదన, మరోవైపు అడవుల సంరక్షణ బాధ్యతలతో అటవీశాఖ చర్యలు..
ఈ రెండు అంశాల మధ్య తలెత్తిన ఈ వివాదం ఇప్పుడు సామాజిక, రాజకీయ, న్యాయపరమైన చర్చలకు కేంద్రబిందువైంది.
ఈ సంఘటనలో అటవీ సిబ్బందితో పాటు, కొంతమంది మహిళా అటవీ సిబ్బంది కూడా గాయపడగా, ఒక గిరిజన మహిళ కూడా గాయపడి చికిత్స పొందుతోంది అనేది తెలిసిన విషయమే. ఇరువైపుల పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ , తమ వాదనలను, ఆవేదనను మీడియాకు , ప్రజలకు, అధికారులకు తెలియజేస్తున్నారు. ఇంతకు ఘటనకు అసలు కారణాలేమిటి? ముందస్తు ప్రణాళికతో దాడి జరిగిందా? లేక పరిస్థితులు అదుపుతప్పి ఘర్షణకు దారితీసాయా? అనే అంశాలపై అటవీశాఖ ఉన్నత అధికారులు, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు పరిశీలించటం జరిగింది. సంఘటనను నిశితంగా గమనించి , ఇరువైపులా వాదనను విని ఎవరిది తప్పు ?ఒప్పు? అనేది నిర్ధారించే పనిలో ఉన్నాము అని అధికారులు పేర్కొనడం జరిగింది.

*దాడి ముందస్తు ప్రణాళికలో భాగమేనా..?*

సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఘర్షణ జరుగుతున్న సమయంలో కొందరు సెల్‌ఫోన్లతో వీడియోలు చిత్రీకరించడం, ఒకరి చేతిలో పెట్రోల్ బాటిల్ కనిపించిందనే ఆరోపణలు చర్చనీయాంశము అయ్యాయి.
తుడుం దెబ్బ నాయకులు మాట్లాడుతూ, "భూమి సమస్య పరిష్కారం కోసం వచ్చిన చోట పెట్రోల్ బాటిల్ ఎందుకు ఉంది? ఘర్షణను ఆపకుండా వీడియోలు ఎందుకు తీశారు? అమాయక మహిళలను ముందుకు నెట్టి దాడులు చేయించింది ఎవరు? దీని వెనుక కీలక పాత్రధారులు ఉన్నారా?" అనే కోణంలో కూడా సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలపై ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి అధికారిక నిర్ధారణ ప్రకటించలేదు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

*అటవీ శాఖ కీలక వాదన.*

అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రభుత్వం చేపట్టిన అటవీ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆక్రమిత అటవీ భూములలో మొక్కల పెంపకం, ట్రెంచ్ తవ్వకం పనులు నిర్వహించేందుకు అటవీ సిబ్బంది వెళ్లిన సమయంలో , కొందరు వ్యక్తులు పనులను అడ్డుకుని యంత్రాన్ని నిలిపివేసి, మహిళా అటవీ ఉద్యోగులు, యంత్ర డ్రైవర్‌తో పాటు విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిపై దాడి చేశారని వారు ఆరోపిస్తున్నారు.
అటవీశాఖ సిబ్బంది మాట్లాడుతూ "అడవులను రక్షించడం మా చట్టబద్ధమైన విధి. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులు జరిగితే, భవిష్యత్తులో విధులు ఎలా నిర్వర్తించగలం? అడవిని కాపాడేది మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు. తాము ఆక్రమించుకోని అటవీ సంపదను దోచుకోవడానికి కాదు. ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చట్టబద్ధంగా అప్పగించిన విధులను నిర్వర్తించడమే మా బాధ్యత. విధులు నిర్వహించడం పాపమా? చట్టరీత్యా నేరమా?" అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గాయపడిన తమ సిబ్బందిని పరామర్శించకుండా, ఒకే కోణంలో తమపై దుష్ప్రచారం జరుగుతోందని వారు వాపోతున్నారు. "మా కుటుంబాలను వదిలి ప్రజల భవిష్యత్తు కోసం, అడవుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న సిబ్బందిపై దాడులు జరగడం బాధాకరం. ప్రభుత్వ విధులను నిర్వర్తించే ఉద్యోగులకు రక్షణ లేకపోతే చట్ట అమలు ఎలా జరుగుతుంది?. కొంతమంది మీడియా ప్రతినిధులు, 
 రాజకీయ నాయకులు మరియు ప్రజలు కూడా రెండు వైపుల పరిస్థితిని గమనించి, న్యాయబద్ధంగా ఆరోపణలు చేయకుండా కేవలం గిరిజనుల వైపు, గొత్తి కోయల వైపు మాత్రమే మాట్లాడటం, విది నిర్వహణలో గాయపడిన తమ గిరిజన మహిళా సిబ్బంది పట్ల, ఇతర సిబ్బంది పట్ల సానుభూతిని చూపలేదు . కాని అన్యాయంగా పోడు భూములను ఆక్రమించుకొని, విధి నిర్వహణలో ఉన్న తమపై దాడికి దిగిన వారిని పరామర్శించడానికి వెళ్లారు. మాపై మాత్రం 
 ఇంత కాఠిన్యమా. మావి ప్రాణాలు కావా. విధి నిర్వహణలో మా ప్రాణాలు పోతే మా కుటుంబాల పరిస్థితి ఏమిటి అని వారు ప్రశ్నిస్తున్నారు. 

*గిరిజనుల వాదన.*

మరోవైపు ఆదివాసులు మాత్రం తాము సాగు చేస్తున్న పోడు భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడం, మహిళలపై బలప్రయోగం చేయడం వలననే ఉద్రిక్తత ఏర్పడిందని ఆరోపిస్తున్నారు.
కొన్ని సంవత్సరాలుగా తాము సాగుచేస్తున్న భూములపై హక్కులు ఇవ్వకుండా తమ జీవనాధారాన్ని దూరం చేయడం అన్యాయం. మా జీవితం, మా కుటుంబాల భవిష్యత్తు ఈ పోడు భూముల పైనే ఆధారపడి ఉంది" అని ఆదివాసీలు, గ్రామస్థులు చెబుతున్నారు.

*రాజకీయాలు – ఏకపక్ష వైఖరిపై విమర్శలు.*

సంఘటన అనంతరం కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని మీడియా సంస్థలు ఒకే వర్గం వాదనకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. గాయపడిన గిరిజనులను పరామర్శించిన ప్రజాప్రతినిధులు, విధి నిర్వహణలో గాయపడిన అటవీశాఖ సిబ్బందిని కూడా పరామర్శించాలని ఉద్యోగులు కోరుతున్నారు.

*అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన.*

సోమవారం భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, జిల్లా అటవీశాఖ అధికారి విక్రమ్ సింగ్, ఐటీడీఏ పీవో రాహుల్, ఎఫ్‌డీవో బాబు తదితర అధికారులు ఘటనాస్థలాన్ని సందర్శించారు. బాధితుల నుంచి , స్థానిక గ్రామ పెద్దల, గ్రామస్థుల నుంచి వివరాలు సేకరించి, పోడు భూముల సమస్య, అటవీ భూముల పరిరక్షణ, ఆదివాసుల జీవనాధారాలకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మంగళవారం పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు కూడా సంఘటన స్థలాన్ని సందర్శించటం జరిగింది. గిరిజనులను పరామర్శించి, ఘటనలో జరిగిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

*అటవీశాఖ స్పందన.*

సంఘటన తరువాత ఎఫ్‌డీవో బాబు మాట్లాడుతూ, "అటవీ సంపదను పరిరక్షించడం, అడవుల అభివృద్ధిని వేగవంతం చేయడమే మా ప్రధాన లక్ష్యం. ప్రజలపై దాడులు చేయడం మా ఉద్దేశం కాదు. ప్రజల సహకారంతోనే అడవులను కాపాడగలం. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు" అని విజ్ఞప్తి చేశారు.

*చట్టం ఏం చెబుతోంది?*,

ఈ ఘటనలో దర్యాప్తులో తేలే వాస్తవాల ఆధారంగా వివిధ చట్టాలు వర్తించే అవకాశం ఉంది.

*గిరిజనుల హక్కులు.*
- భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 – జీవించే హక్కు, గౌరవప్రదమైన జీవన హక్కు.
- భారత రాజ్యాంగం ఆర్టికల్ 46 – షెడ్యూల్డ్ తెగల విద్యా, ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం పరిరక్షించాల్సిన బాధ్యత.
- అటవీ హక్కుల చట్టం–2006 ( ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ , 2006) – అర్హులైన గిరిజనులు, సంప్రదాయ అటవీ నివాసితుల వ్యక్తిగత, సామూహిక అటవీ హక్కులను గుర్తించే చట్టం.
- ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం–1989 – షెడ్యూల్డ్ తెగలపై కులం లేదా తెగ ఆధారంగా జరిగే దాడులు, అవమానాలు, హక్కుల ఉల్లంఘనలకు రక్షణ కల్పించే చట్టం.

.*అటవీశాఖ అధికారుల విధులు – హక్కులు.*
భారత అటవీ చట్టం–1927తో పాటు ఇతర అటవీ చట్టాల ప్రకారం అడవులను సంరక్షించడం, అక్రమ ఆక్రమణలను అరికట్టడం, ప్రభుత్వ అటవీ భూములను రక్షించడం అటవీశాఖ అధికారుల చట్టబద్ధమైన బాధ్యత. అదే సమయంలో విధి నిర్వహణలో మానవ హక్కులు, చట్టబద్ధ విధానాలను పాటించడం కూడా వారి బాధ్యతే.
భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్) ప్రకారం
దర్యాప్తులో తేలే పరిస్థితులను బట్టి:

- సెక్షన్ 221 – ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణను అడ్డుకోవడం.
- సెక్షన్ 132 – విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి లేదా నేరపూరిత బలప్రయోగం.
- సెక్షన్ 115 – స్వచ్ఛందంగా గాయపరచడం.

అదే విధంగా దర్యాప్తులో గిరిజన మహిళపై చట్టవిరుద్ధంగా బలప్రయోగం, అవమానకర ప్రవర్తన జరిగినట్లు తేలితే ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం–1989లోని సంబంధిత నిబంధనలు కూడా వర్తించే అవకాశం ఉంది.

*పరిష్కారం ఎక్కడ?*

ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం కోసం నిపుణులు సూచిస్తున్న ప్రధాన అంశాలు:

-రెవెన్యూ– అటవీశాఖల సంయుక్త సర్వే.- అటవీ హక్కుల దరఖాస్తుల త్వరితగతిన పరిష్కారం.- గ్రామసభలతో ముందస్తు సంప్రదింపులు.- చట్టబద్ధ హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించడం.- దాడులకు పాల్పడిన వారు ఎవరైనా చట్టప్రకారం చర్యలు తీసుకోవడం.
చివరిగా మనుబోతులగూడెం ఘటనలో అసలు బాధ్యత ఎవరిదన్నది ఉన్నతాధికారుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమవుతుంది. అడవులను సంరక్షించడం ఎంత ముఖ్యమో, గిరిజనుల జీవన హక్కులను పరిరక్షించడం కూడా అంతే ముఖ్యమైనది. అదే సమయంలో విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేయడం చట్టరీత్యా తీవ్రమైన నేరం. మరోవైపు అధికారులు కూడా తమ చట్ట పరిమితులలో, మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన బాధ్యత ఉంది. రాజకీయాలు, ప్రచారాలకు అతీతంగా వాస్తవాలను వెలికితీసి, చట్టబద్ధమైన పరిష్కారాన్ని కనుగొన్నప్పుడే మనుబోతుల గూడెం లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నివారించవచ్చు అని పర్యావరణ ప్రేమికులు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
3/related/default